- 30.70 టన్నుల సీడ్ స్వాధీనం, నలుగురిపై కేసు
కోటపల్లి, వెలుగు: రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించేందుకు ప్రయత్నించిన అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సరైన అనుమతులు, బిల్లులు లేకుండా మహారాష్ట్ర నుంచి లారీలో అక్రమంగా తరలిస్తున్న 30.70 టన్నుల వరి విత్తనాలను రాపన్పల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద స్వాధీనం చేసుకున్నారు.
వీటి విలువ రూ.21.49 లక్షలు ఉంటుందని జైపూర్ ఏసీపీ ఏ.వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. కోటపల్లి ఏవో సాయికృష్ణ రెడ్డి ఇచ్చిన సమాచారంతో కోటపల్లి ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో రాపన్పల్లి చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు.
మహారాష్ట్రలోని సిరోంచా ప్రాంతం నుంచి కరీంనగర్ జిల్లా మానకొండూర్ వైపు వెళ్తున్న లారీని తనిఖీ చేయగా, నకిలీ వరి విత్తనాలు పట్టుబడినట్లు చెప్పారు. లారీ డ్రైవర్ కట్ల భద్రయ్య, సీడ్ ఆర్గనైజర్ నిమ్మటి సతీశ్, సోనం సీడ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జీఎన్వీ రామకృష్ణ-, లారీ ఓనర్ పోలవేని రాజేశ్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఏసీపీతో పాటు చెన్నూర్ రూరల్ సీఐ ఆర్ కృష్ణ, కోటపల్లి ఎస్సై రాజశేఖర్ పాల్గొన్నారు.
